Uttarakhand: ఉత్తరాఖండ్ పోలీసుల నిర్వాకం.. ఎద్దులబండికి రూ.1,000 జరిమానా!

  • మోటార్ వాహనాల చట్టం కింద విధింపు
  • అధికారులపై మండిపడ్డ రైతు హసన్
  • చలానాను వెనక్కి తీసుకున్న పోలీసులు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మోటార్ వాహనాల చట్టం-2019 సామాన్యులకు నరకం చూపిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించకపోయినా ఆటోలో హెల్మెట్ పెట్టుకోలేదనీ, బైక్ పై సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు చలానాలు రాస్తుండటంతో ప్రజలు సొంత వాహనాలను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. తాజాగా పొలం వద్ద ఎద్దుల బండి పెట్టుకున్నందుకు పోలీసులు ఓ రైతుకు జరిమానా విధించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎద్దుల బండిని నిలిపిఉంచాడు. ఈ నేపథ్యంలో దాన్ని గమనించిన పోలీసులు హసన్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడని అనుమానించారు. అనంతరం హసన్ ఇంటికి వెళ్లి రూ.1,000 జరిమానాను అందజేశారు. దీంతో తిక్కరేగిన హసన్..‘అసలు ఎద్దులబండి మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి ఎలా వస్తుంది?’ అంటూ తీవ్రంగా మండిపడ్డాడు.

దీంతో తమ తప్పు తెలుసుకున్న పోలీసులు చలాన్ రద్దుచేసి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈలోగా ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో వాస్తవానికి హసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ, అయితే అతను తప్పు చేయలేదని తేలడంతో చలాన్ ను వెనక్కు తీసుకున్నామని పోలీసులు వివరణ ఇచ్చారు.

More Telugu News