Hazipur: హాజీపూర్ కు వెళ్లిన మీడియాపై ప్రజల దాడి!

  • కట్టలు తెగిన ప్రజల ఆగ్రహం
  • తమ గ్రామంలోకి రావద్దంటూ దాడి
  • పోలీసులపైనా విమర్శలు

తమకళ్ల ముందు తిరుగుతూ, తమ ఊరిలోనే దాగున్న మానవ మృగం చేతిలో తీవ్రంగా హింసించబడి, దారుణ హత్యకు గురైన అమ్మాయిలను తలచుకుని బాధపడుతున్న బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గత నాలుగైదు రోజులుగా ఈ మారుమూల గ్రామంలో వెలుగుచూసిన హత్యలు తీవ్ర కలకలం రేపగా, గతంలో అమ్మాయిల అదృశ్యంపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందువల్లే దారుణాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలకు దిగారు.

ఈ ఉదయం ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటిని నాశనం చేసి, తగులబెట్టిన ప్రజలు, చిత్రీకరణకు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కవరేజ్ కి వెళ్లిన తెలుగు వార్తా చానెళ్ల ప్రతినిధులు, కెమెరామెన్ లపై ప్రజలు దాడికి దిగారు. తమ గ్రామానికి రావద్దంటూ వారితో వాగ్వాదానికి దిగి, కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో రాచకొండ పోలీసులు అక్కడే ఉన్నా, వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలోకి మీడియాను అనుమతించేది లేదని ప్రజలు స్పష్టం చేయడంతో, చేసేదేమీ లేక మీడియా వెనుదిరగాల్సి వచ్చింది.

More Telugu News