Sujana Chowdary: సభాపతి విచక్షణాధికారాల మేరకు నిర్ణయం తీసుకోవచ్చు: సుజనా చౌదరి

  • సభ్యులను అదుపు చేసే బాధ్యత స్పీకర్‌ది
  • అవిశ్వాస తీర్మానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
  • మా విజ్ఞప్తులపై సభాపతి సానుకూలంగా స్పందించడం లేదు
  • అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయి

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చేసేందుకు తాము అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ రోజు లోక్‌సభ రేపటికి వాయిదా పడిన అనంతరం పార్లమెంటు వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిరసన తెలుపుతోన్న సభ్యులను అదుపు చేసి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపించాల్సిన బాధ్యత లోక్‌సభ స్పీకర్ పై ఉందని అన్నారు. సభాపతి విచక్షణాధికారాల మేరకు సభ్యులను అదుపు చేసి, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేందుకు నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
 
అవిశ్వాస తీర్మానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులపై సభాపతి సానుకూలంగా స్పందించడం లేదని, అవిశ్వాసం ఎదుర్కుంటే కేంద్ర సర్కారు పడిపోయే అవకాశం లేదని బీజేపీకి తెలుసని, అయినప్పటికీ ఇలా చేస్తోందని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనివ్వకుండా అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీలు అడ్డుకుంటున్నాయని, తమ తమ రాష్ట్రాల సమస్యలపై చర్చించాలంటూ నిరసన తెలుపుతున్నాయని అన్నారు. రేపు తమ తమ రాష్ట్రాల సమస్యలపై లోక్‌సభలో చర్చించేటప్పుడు కూడా అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ పార్టీలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

More Telugu News