: నంద్యాల ఉప ఎన్నికపై మా టీమ్ పరిశీలన జరిపింది: లగడపాటి

నంద్యాల ఉప ఎన్నికలపై తమ టీమ్ పరిశీలన జరిపిందని... ఎన్నికలో టీడీపీ విజయం ఖాయమని టీమ్ తెలిపిందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ప్రీ పోలా? లేక ఎగ్జిట్ పోలా? అనేది పాయింట్ కాదని... ఇది తమ టీమ్ అభిప్రాయమని ఆయన తెలిపారు.

 నామినేషన్లు వేయకముందు నుంచి తమ సభ్యులు నంద్యాలలోని పరిస్థితిని పరిశీలించారని, మధ్యలోనూ పరిశీలించారని, పోలింగ్ జరిగిన రోజునా పరిశీలించారని... ఇవన్నీ జరిగిన తర్వాత నంద్యాలలో గెలుపు ఎవరిదనే విషయాన్ని తనకు వెల్లడించారని చెప్పారు. టీడీపీ గెలుపు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని... అది తన టీమ్ అంచనా మాత్రమేనని తెలిపారు. మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నిక కావడంతోనే... నంద్యాల ఉప ఎన్నికలకు ఇంతటి ప్రచారం వచ్చిందని అన్నారు.

ప్రజలకు సేవ చేయాలనే భావనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలతోనే మమేకమై జీవించానని... కొన్ని ప్రత్యేక కారణాల రీత్యానే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని లగడపాటి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని రోజులపాటు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ... ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు శాంతియుతంగా కలసిమెలసి ఉంటున్నారని, ఇది ఎంతో సంతోషించదగ్గ పరిణామమని అన్నారు.

More Telugu News