: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రెండు కోర్కెలు కోరుతున్నాను!: వెంకయ్యనాయుడు

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి తాను రెండు కోరుకుంటున్నట్టు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... తెలుగు భాషపై స్పందించారు. తెలుగు భాషకు గ్లామర్ మాత్రమే కాదని, గ్రామర్ కూడా ఉందన్నారు. ఇదే సందర్భంలో తాను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల నుంచి రెండు కోర్కెలను ఆశిస్తున్నట్టు చెప్పారు. సమస్యలను ఇద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం అందులో ఒకటి గా పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడం రెండోదని చెప్పారు.

ఇంగ్లిష్ జబ్బు మనల్ని చాలా కాలంగా పట్టుకుని ఉందని, ఇది పోవడం అంత సులభం కాదన్నారు. దీనికి మందు కూడా లేదన్న విషయం తెలుసన్నారు. ఒక అంటు వ్యాధిలా బాగా వ్యాపించిందన్న ఆయన తాను ఇంగ్లిష్ భాషకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆ విషయం తనకు తెలుసని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై, రాజ్యసభ చైర్మన్ గా తాను కూడా ఇంగ్లిష్ లో మాట్లాడుతూనే ఉంటానన్నారు. అయితే, భాష, భావం రెండూ కలసి ఉండాలన్నది తన అభిప్రాయంగా పేర్కొన్నారు. భాష ద్వారానే మన సంస్కృతిని వ్యక్తం చేయగలమన్న ఆయన దాన్ని మర్చిపోరాదన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు తన దృష్టిలో మానవుడే కాదన్నారు.

More Telugu News