: ప్రపంచకప్‌ కోసం అరేబియన్ టోపీ ఆకారంలో స్టేడియం.. అధునాతన హంగులతో నిర్మించనున్న ఖతర్!

2022 ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతర్ ఇందుకోసం  ప్రత్యేకంగా ఓ స్టేడియం నిర్మించాలని యోచిస్తోంది. అధునాతన హంగులతో, సకల సౌకర్యాలతో కూడిన ఈ స్టేడియంను అరేబియన్ టోపీ ఆకారంలో నిర్మించనున్నట్టు ఆదివారం నిర్వాహకులు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఖతర్ ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలతో సౌదీ అరేబియా, ఈజిప్ట్, బహ్రయిన్, యూఏఈలు ఖతర్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచుకున్నాయి. ఆయా దేశాల నుంచి సహకారం ఆగిపోవడంతో టర్కీ, ఇరాన్ తదితర దేశాల నుంచి ఒమన్ మీదుగా ఓడల్లో పెద్ద మొత్తంలో ఆహారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అలాగే వరల్డ్ కప్ ప్రాజెక్టు కోసం నిర్మాణ సామగ్రిని కూడా తెప్పించుకుంటోంది.

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ స్టేడియంలో 40 వేల మంది ప్రేక్షకులు కూర్చునేలా, అరేబియన్ టోపీ ‘గాఫియా’ ఆకారంలో నిర్మించనున్నారు. ఇందుకు సబంధించిన డిజైన్‌ను ఖతర్‌కే చెందిన ఆర్కిటెక్ట్  సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ స్టేడియం తమను అరబ్ దేశాలు సహా అంతర్జాతీయ ముస్లిం సమాజంతో ఏకం చేస్తుందని ఖతర్ 2022 కమిటీ చీఫ్ హాసన్ అల్-తవాడీ తెలిపారు.

More Telugu News