: 7 వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు..చారిత్రక విజయానికి 3 వికెట్ల దూరం

టీమిండియా చారిత్రక విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా శ్రమిస్తోంది. భారత బౌలర్ల ధాటికి లంకేయులు బెంబేలెత్తిపోతున్నారు. అర్జున రణతుంగ, అరవింద్ డిసిల్వా, జయసూర్య, చమిందావాస్, ముత్తయ్యమురళీ ధరన్, మార్వాన్ ఆటపట్టు, ఉపుల్ తరంగ, కుమార ధర్మసేన, దిల్షాన్, జయవర్థనే, సంగక్కర వంటి దిగ్గజాలు ఆడిన లంక జట్టేనా అన్నంత దారుణమైన ప్రదర్శనతో లంకేయులు అభిమానులను నిరాశపరిచారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ కు దీటైన సమాధానం చెప్పడంలో తడబడ్డారు. దీంతో మూడు టెస్టుల సిరీస్ ను ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే అప్పగించే స్థితికి చేరుకున్నారు.

 19 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకేయులు ఆరంభంలోనే కరుణ రత్నే (17) వికెట్ కోల్పోయారు. అనంతరం కుశాల్ మెండిస్ (12)కూడా విఫలమయ్యాడు. ఆ తరువాత చండిమాల్ (36), మాథ్యూస్ (35) కొంత ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే టీమిండియా బౌలర్ల ముందు వారి పప్పులుడకలేదు. అనంతరం పెరీరా (8)ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో డిక్ విల్లా (24) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా సందకన్ ఆడుతున్నాడు. దీంతో 62 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి శ్రీలంక జట్టు 142 పరుగులు చేసింది. మరో రెండు వికెట్లు లంక జట్టు చేతిలో వున్నాయి. టీమిండియా బౌలర్లలో 3 వికెట్లతో అశ్విన్ రాణించగా, షమి రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 

More Telugu News