: అనుమానాస్పద మరణం: ఢిల్లీలో భవంతిపై నుంచి పడి మరణించిన మాజీ మంత్రి కుమారుడు!

మణిపూర్ విద్యా శాఖ మాజీ మంత్రి ఎం ఒకేంద్రు కుమారుడు, 19 ఏళ్ల సిద్ధార్థ అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రెండో ఫ్లోర్ నుంచి కిందపడి మరణించాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సిద్ధార్థ, తన స్నేహితులతో కలసి సఫ్దర్ గంజ్ ప్రాంతంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఓ రెస్టారెంట్ టెర్రస్ పై నుంచి ఓ యువకుడు పడిపోయాడని వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి అతన్ని సిద్ధార్థగా గుర్తించారు. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మరణించాడు.

అతని కారు డ్రైవర్ రెస్టారెంట్ వద్ద దించి వెళ్లినట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి. ఆపై మద్యం తాగిన ఆయన టెర్రస్ పైకి ఎక్కి, అక్కడి నుంచి గోడ మీదుగా పక్కనే ఉన్న మరో రెస్టారెంట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వెయిటర్ వారించిన వేళ, వాగ్వాదం జరిగింది. ఆపై సిద్ధార్థ రెండు భవనాల మధ్య ఉన్న రెయిలింగ్ ను దాటబోయి కిందపడగా, అక్కడే ఉన్న పూలకుండీలు అతని తలకు బలంగా తగిలాయి. ఈ విషయంలో సీసీటీవీ ఫుటేజ్ లన్నీ పరిశీలిస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించగా, సిద్ధార్థ చెల్లెలు మాత్రం విచారణ తప్పుదారి పడుతోందని ఆరోపించారు. ఈ మృతి వెనకున్న మిస్టరీని ఛేదిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

More Telugu News