: కారు విడిభాగాలు చూసి బాంబనుకుని కంగారుపడ్డ ఢిల్లీ పోలీసులు!

నాలుగు వైర్లు, ఓ మీటర్, కోసేసిన ఫ్యూజులు, ఓ గుండ్రని పరికరం... ఇవన్నీ ఓ చోట ఉండటాన్ని చూసిన ఢిల్లీ విమానాశ్రయం అధికారులు, బాంబనుకుని హడలిపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఢిల్లీ విమానాశ్రయం కార్గో టర్మినల్ లో ఈ ఉదయం అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. అవేమిటో తెలియని అధికారులు తీవ్ర ఆందోళనతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్, ఆ మెటీరియల్ ను వేరు చేసి, అవి మారుతి సుజుకి కారుకు సంబంధించిన విడి భాగాలని తేల్చారు. కారులో పనికిరాకుండా పోయిన వాటిని పడేశారని బాంబ్ స్క్వాడ్ పేర్కొనడంతో, అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఢిల్లీ విమానాశ్రయం పరిసరాల్లో ఏ చిన్న వస్తువు కనిపించినా అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం జనవరిలో ఓ అనుమానాస్పద బెలూన్ కనిపించిన సమయంలోనూ ఇటువంటి పరిస్థితే ఏర్పడింది.

More Telugu News