: నిన్నటి పొరపాటుకు నేడు తావివ్వని సిట్ సిబ్బంది!

డ్రగ్స్ వ్యవహారంలో హీరోయిన్ ఛార్మి నిన్న సిట్ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె ఎక్సైజ్ కార్యాలయంలోకి వస్తున్న సమయంలో, ఒక్కసారిగా ఆమెను పోలీసు సిబ్బంది చుట్టుముట్టారు. దీంతో, అక్కడ కొద్దిపాటి తొక్కిసలాంటిది చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ చేయి ఆమెకు తగిలింది. దీంతో ఇబ్బందిగా ఫీల్ అయిన ఛార్మి ఈ విషయాన్ని ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు తెలియజేపింది. కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని ఛార్మికి అకున్ తెలిపారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు విచారణకు గాను ముమైత్ ఖాన్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుంది. నిన్న జరిగిన ఘటనతో ఇబ్బందికి గురైన ఎక్సైజ్ అధికారులు... ఈ రోజు అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువ మంది కానిస్టేబుళ్లు ఆమె వెంట రాకుండా చర్యలు తీసుకున్నారు. ఆమె చుట్టూ కేవలం మహిళా సిబ్బందే ఉండేలా చేశారు. దీంతో, అక్కడ ఎలాంటి తోపులాట చోటు చేసుకోలేదు. చాలా ఫ్రీగా ముమైత్ విచారణ హాల్లోకి వెళ్లిపోయింది. 

More Telugu News