: ఏమీ తోచకపోతే సినిమావాళ్లని నలిపేస్తాం: గేయ రచయిత పోస్టును షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ

టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేపుతున్న డ్ర‌గ్స్ కేసులో సినీన‌టుల‌ను సంబంధిత అధికారులు విచారిస్తోన్న నేప‌థ్యంలో ఇత‌ర సినీ ప్ర‌ముఖులు త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ మాత్రం ఎప్పటిలాగే త‌న‌దైన స్టైల్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ మ‌రింత వేడి పుట్టిస్తున్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ సినిమాలకు త‌ప్ప‌కుండా పాట‌లు రాసే సిరాశ్రీ ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై స్పందించి త‌నదైన శైలిలో త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుని వ‌ర్మ హైలైట్ చేసేశారు. త‌న ఫేస్‌బుక్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. సినిమా వాళ్ల‌ను స‌మ‌ర్థిస్తున్న‌ట్లు ఈ ఆసక్తిక‌ర‌ పోస్టు ఉంది. దాన్ని య‌థాత‌థంగా ప్ర‌చురిస్తున్నాం...    
మనకి సినిమావాళ్లు కావాలి:
ఫేసుబుక్కులో
నాలుగు లైకులు కొట్టించుకోవడానికి
సినిమావాళ్లతో ఫోటో కావాలి;
కొత్తగా షాప్ పెట్టుకుంటే
దాని ఓపెనింగ్ కి
సిమిమావాళ్లు కావాలి;
ఇంట్లో పెళ్లి గురించి
నలుగురూ చెప్పుకోవాలంటే
సినిమావాళ్లు రావాలి;
స్కూలు, కాలేజీ ఫంక్షన్లకి
ఊపు రావాలంటే
సినిమావాళ్లు కావాలి;
కానీ సమాజం భ్రష్టు పడుతోంది
అని అనిపించినప్పుడల్లా
మన ఛీత్కారాలన్నీ
సినిమావాళ్లకే పోవాలి.
వాళ్ల ఆవేదన
వాళ్ల ఆక్రందన
వాళ్ల విషాదం
వాళ్ల భయం
వాళ్ల కష్టం
వాళ్ల నష్టం
వాళ్ల బాధ-
ఏదైనా సరే
మనకి వినోదమే!
అవును
మనలో ఉన్న ఆ శాడిజానికి
మనమే దండేసుకోవాలి!
అందుకే-
మన యూట్యూబ్ హిట్స్ కి
సినిమావాళ్లు కావాలి;
మన చానల్ టీ.ఆర్.పీ లకి
సినిమావాళ్ళు కావాలి-
నవ్వుతూ అయినా,
ఏడుస్తూ అయినా,
సజీవంగా అయినా,
జీవచ్ఛవంగా అయినా,
శవంగా అయినా-
ఎలాగైనా పర్లేదు
మనకి సినిమావాళ్లు కావాలి.
సినిమావాళ్లంటే
పబ్లిక్ గార్డెన్లో పువ్వులు-
ముచ్చటేస్తే పొగిడేస్తాం
అవకాశమొస్తే కోసేస్తాం
ఏమీ తోచకపోతే నలిపేస్తాం...
ఇలా
ఏదో ఒకటి చెయ్యడానికి
మనకి సినిమావాళ్లు కావాలి.
- సిరాశ్రీ

More Telugu News