: సుబ్బరాజుని ఇంకా ప్రశ్నిస్తున్నాం.. ఓ ముఖ్యమైన సమాచారం వస్తుంది!: ఎక్సైజ్ కమిషనర్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మూడోరోజు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. ఈ రోజు నటుడు సుబ్బరాజును ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు. విచారణ కొనసాగుతున్న హైదరాబాద్లోని అబ్కారీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... సుబ్బరాజు స్టేట్మెంట్ను రికార్డు చేశామని అన్నారు. ఈ రోజు ఓ ముఖ్యమైన సమాచారం వస్తుందని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే పలు కీలక విషయాలు బయటపడ్డాయని అన్నారు.
ఈ కేసులో నోటీసులు పంపించిన వారిని అడగాల్సిన ప్రశ్నావళిని ముందుగానే సిద్ధం చేసి అడుగుతున్నామని చంద్రవదన్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారంతా కార్యాలయానికి వచ్చి తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారని అన్నారు. వారి నుంచి మంచి సహకారం లభిస్తోందని తెలిపారు. డ్రగ్స్ విషయంలో సుదీర్ఘంగా విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు.