: పట్టిసీమ నీళ్లు తోడే ప్రాజెక్టు కాదు.. డబ్బులను తోడే ప్రాజక్టు!: ఉండవల్లి ఆరోపణలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడికి లేదని వ్యాఖ్యానించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్ర‌భుత్వ నేత‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న మ‌రోసారి ఆరోపించారు. ఆయా ప్రాజెక్టుల విష‌యంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌పై తాను రెండున్నరేళ్ల నుంచి అనేక అంశాలపై రాష్ట్ర స‌ర్కారుని ప్రశ్నిస్తున్నానని ఆయ‌న అన్నారు. త‌న ప్ర‌శ్న‌ల‌కు కనీసం ఆఫీస్‌ అటెండర్‌ నుంచి కూడా జ‌వాబు రావ‌డం లేద‌ని వాపోయారు.

స‌ర్కారు పనితీరును అంచనా వేసేందుకు కాగ్‌ నివేదికే సరైన ఆయుధమని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఆ నివేదిక ఆధారంగా స‌ర్కారు పనితీరును పీఏసీ ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును నీళ్లు తోడే ప్రాజెక్టుగా కాకుండా డబ్బులను తోడే ప్రాజెక్టుగా ప్రభుత్వ నేతలు ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.  

More Telugu News