: వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తూనే పూరీపై ప్రశ్నల వర్షం!

సినీ సెలబ్రిటీగా పేరున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ను ఓ వీఐపీగా ట్రీట్ చేస్తూనే సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ గంటన్నరకు పైగా విచారణ సాగగా, తొలి అరగంట పాటు, తమకు తెలిసిన కొన్ని విషయాలను పూరీకి చెప్పిన అధికారులు, నిజం చెప్పకుంటే జరిగే పరిణామాలను వివరించినట్టు సమాచారం. ఆపై మొత్తం వ్యవహారంలో ఆయన వర్షన్ ను చెప్పాలని కోరినట్టు తెలుస్తోంది. ముక్తసరిగానే మాట్లాడుతున్న పూరీ జగన్నాథ్ తమ వర్షన్ ను పూర్తి చేసుకోగా, అధికారులు తమ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

సాధ్యమైనంత వరకూ ఇబ్బందులు పెట్టకుండానే సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారని, మొత్తం విచారణను రెండు వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తున్నారని సిట్ సిబ్బంది వెల్లడించారు. మంచినీరు, కూల్ డ్రింక్స్, స్నాక్స్ తదితరాలన్నీ అందుబాటులో ఉంచామని, ఒంటిగంట తరువాత లంచ్ బ్రేక్ ఉంటుందని, ఈలోగా ఆయన సమాధానాలన్నీ సరైనవేనని తెలిస్తే, ఇంటికెళ్లే భోజనం చేయవచ్చని, లేకుంటే ఇక్కడే తిని, ఆపై తిరిగి విచారణను ఎదుర్కోవాల్సి వుంటుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News