: ప్రాథమిక పాఠశాల విద్యార్థుల హోంవర్క్‌కు చెల్లుచీటీ.. పుస్తకాల బరువుకు చెక్.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

నడుం వంగిపోయేలా పుస్తకాలు మోసే చిన్నారులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. సంచి బరువుతోపాటు, హోంవర్క్‌లను కూడా తగ్గిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. పిల్లలు మోసే పుస్తకాల సంచి బరువు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో పుస్తకాల సంచి బరువు 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 12 నుంచి 17 కిలోలు ఉన్నట్టు గుర్తించారు.

 ఈ బరువు కారణంగా విద్యార్థుల వెన్నెముక, మోకాళ్లు దెబ్బతినే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారు. దీంతో తరగతుల వారీగా పుస్తకాల బరువు గరిష్టంగా ఎంత ఉండాలో పేర్కొంటూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిర్దేశించిన ప్రకారం పాఠ్యపుస్తకాలు ఉండాలని, గైడ్లు, అనవసర విద్యాసంబంధ పుస్తకాలను ప్రోత్సహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఐదో తరగతి వరకు పిల్లలకు హోంవర్క్ ఇవ్వరాదని, బడిలోనే దానిని చేయించాలని, అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా ఓ పిరియడ్ కేటాయించాలని పేర్కొంది.  

 

More Telugu News