: మనకు ఓ 'పప్పు' ఉన్నాడు.. అతడిని చూస్తే నాకు కామెడీ యాక్టరే గుర్తుకొస్తాడు!: లోకేశ్ పై రోజా సెటైర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. ఈ రోజు తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘మనకు ఓ పప్పు ఉన్నాడు.. అతడిని చూస్తే నాకు కామెడీ యాక్టరే గుర్తుకొస్తాడు. ప్రతిదానికి సవాలు విసురుతున్నాను అంటాడు. నిజానిజాలను తేల్చడానికి సీబీఐ విచారణ వేయమని చెబితే మాత్రం పట్టించుకోడు. విశాఖపట్నం భూముల కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించండి. నువ్వూ, మీ నాన్న, మీ మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నవారు ఎవరయినా సరే సీబీఐ విచారణ వేస్తే వారి సంగతి ఏంటో తేలుతుంది. సీబీఐ విచారణ వేసి మీ నాన్న తుప్పు కాదు నిప్పు అని నిరూపించుకో. అలా కాకుండా సవాలు అంటూ మీడియా ముందుకు వస్తే.. కోడి చికెన్ షాపు ముందుకు వచ్చి తొడకొడితే ఏం అవుతుందో అదే జరుగుతుంది’ అని రోజా వ్యాఖ్యానించారు.
మద్యం వ్యాపారంలో జరుగుతున్న అవకతవకలపై మాత్రం టీడీపీ నేతలు మాట్లాడబోరని రోజా అన్నారు. సోమిరెడ్డి మీడియా ముందుకు వచ్చి సోది మాట్లాడతారని రోజా ఎద్దేవా చేశారు. ఆయన చెప్పే సోదిని చూసే టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిందని అన్నారు. ఆయన ఇన్ని సార్లు ఓడిపోయినప్పటికీ ఆయనకు మంత్రిపదవి ఇచ్చారని అన్నారు.