: డిప్యూటీ సీఎం పదవి నుంచి తేజస్వి తప్పుకోడు: ఆర్జేడీ

బీహార్ లో అధికారాన్ని పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తమ పార్టీ ప్రజాప్రతినిధులతో రేపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని నితీశ్ కుమార్ కోరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆర్జేడీ నేతలతో లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు.

భేటీ అనంతరం ఆర్జేడీ నేత, బీహార్ ఫైనాన్స్ మినిస్టర్ అబ్దుల్ బారీ సిద్దిఖీ మాట్లాడుతూ, డిప్యూటీ సీఎం పదవి నుంచి తేజస్వి యాదవ్ వైదొలగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిరపరిచేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఆర్జేడీని భ్రష్టు పట్టించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని... అయితే వారి ఆశ నెరవేరదని చెప్పారు. గతంలో తాము ఎంత బలంగా ఉన్నామో... రాబోయే రోజుల్లోనూ అంతే బలంగా తయారవుతామని తెలిపారు. మహా కూటమిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని... అయితే, బీహార్ లోని జేడీయూ, ఆర్జేడీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం స్థిరంగా ఉందని చెప్పారు.

More Telugu News