: చివర్లో మెరిసేది ఎవరో? నేడు విండీస్ తో పొట్టి పోరు!

వన్డే సిరీస్ ను పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఆడించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, నేడు జరిగే ఏకైక టీ-20 పోటీకి ప్రధాన ఆటగాళ్లను బరిలోకి దించడంతో, సాయంత్రం 9 గంటల నుంచి జరిగే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారి, అభిమానులను అలరించనుంది. క్రిస్‌ గేల్‌, పొలార్డ్‌, శామ్యూల్స్‌ వంటి ఆటగాళ్లతో విండీస్ జట్టు బలంగా కనిపిస్తోంది. వీరితో పాటు లూయిస్, జాసన్, చాడ్విక్, బ్రాత్ వైట్, నరైన్, బద్రి, టేలర్ తదితరులూ విండీస్ తరఫున బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

ఇక భారత జట్టులో యువరాజ్ కు స్థానం ఏ మేరకు ఉంటుందన్నది సందేహమే. ఇటీవలి కాలంలో యువరాజ్ పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్నాడు. జాదవ్, కార్తీక్ లలో ఒకరు, జడేజా, అశ్విన్ లలో ఒకరు, భువనేశ్వర్, షమీలలో ఒకరికి మాత్రమే అవకాశాలు దక్కవచ్చు. బ్యాటింగ్ కు సహకరించేలా కనిపిస్తున్న పిచ్ పై భారీ స్కోర్లు నమోదు కావచ్చని క్రీడా పండితులు భావిస్తున్నారు. వర్షం పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ చెప్పడంతో, ఈ మ్యాచ్ అభిమానులకు మంచి విందేనని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ లో గెలుపుతో విండీస్ పర్యటనను విజయవంతంగా ముగించాలని భారత్, గెలిచి చూపి, విండీస్ బోర్డుపై ఒత్తిడి పెంచాలని గేల్ వంటి కీలక ఆటగాళ్లు భావిస్తున్నారు.

More Telugu News