: గౌరవంగా పోతారా? తన్ని తరమమంటారా?: చైనా మరో హెచ్చరిక

భారత్, చైనా సరిహద్దుల్లో, సిక్కిం సమీపంలోని డోక్లాం ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, చైనా మరో హెచ్చరిక చేసింది. డోక్లాం తమ పరిధిలోనిదేనని చెబుతూ, భారత సైన్యం గౌరవంగా వెనుదిరిగితే బాగుంటుందని, లేకుంటే తాము తన్ని తరిమేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సర్వ సన్నద్ధంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' కటువు వ్యాఖ్యలతో కూడిన సంపాదకీయాన్ని రాసింది.

చైనా భూభాగం నుంచి భారత దళాలను తరిమేసే శక్తి తమకు లేదని ఆ దేశం భావిస్తే, అది వారి అవివేకమని వ్యాఖ్యానించింది. భారత రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేసింది. ఆయన చెప్పిన మాటలు వాస్తవమేనని, 1962 నాటి ఇండియా, ఇప్పుడు లేదని చెబుతూనే, తమ దళాలు రంగంలోకి దిగితే, అప్పటి కన్నా పెను నష్టం ఇండియాకు తప్పదని పేర్కొంది. తమ సైన్యం ఎంతో సంయమనాన్ని పాటిస్తోందని, భారత్ ను అడ్డుకునే అన్ని యత్నాలకూ చైనీయుల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపింది. చైనా ప్రజలు పూర్తి ఐకమత్యంతో ఉన్నారని పేర్కొంది. కాగా, గడచిన 19 రోజులుగా డోక్లాం ప్రాంతంలో ఇరు దేశాల సైన్యం మోహరించగా, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.

More Telugu News