: ఉగ్రవాద సంస్థ ఐఎస్‌లో చేరిన కేరళీయుల్లో ఐదుగురి మృతి.. సిరియాలో జరుగుతున్న పోరులో ప్రాణాలు కోల్పోయిన మలయాళీలు!

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)లో చేరిన కేరళలోని మలబార్ ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గత నాలుగు నెలలుగా సిరియాలో జరుగుతున్న పోరులో వీరు మృతి చెందినట్టు భావిస్తున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మరణించిన మలయాళీల సంఖ్య పదికి చేరుకుంది.

బహ్రెయిన్‌లో పనిచేస్తూ గతేడాది జూలైలో ఐఎస్‌లో చేరిన సిబి మృతి చెందినట్టు రెండు రోజుల క్రితమే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అయితే ఇంతకుమించి వివరాలు తెలియరాలేదు. మలప్పురం జిల్లాలోని వండూరు చెందిన ముహాదిస్ అలెప్పోలో ప్రాణాలు కోల్పోయాడు. బహ్రెయిన్‌లో ఉన్న ముహాదిస్ సోదరుడు నెల రోజుల క్రితమే కేరళ వచ్చి కుటుంబ సభ్యులకు ముహాదిస్ మృతి గురించి తెలియజేసినట్టు సమాచారం. అలెప్పోలో జరుగుతున్న పోరులో ఫిబ్రవరిలో అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది. అలాగే కన్నూరులోని చలాడ్‌కు చెందిన మరో యువకుడితోపాటు కోజికోడ్‌లోని వడకర, మలప్పరం జిల్లాలోని కొండొట్టికి చెందిన మరో ఇద్దరు సిరియాలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ఐదుగురిని పోలీసులు ‘బహ్రయిన్’ గ్రూపులోని సభ్యులుగా పేర్కొంటున్నారు.

More Telugu News