: ధనుష్ - సౌందర్య మా ఇంటికి వచ్చి అబద్ధం చెప్పారు: నటి కాజోల్

‘వీఐపీ2’ చిత్రంలో తనకు తమిళ్ డైలాగ్స్ ఎక్కువగా ఉండవని ధనుష్, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అబద్ధం చెప్పారని బాలీవుడ్ నటి కాజోల్ నవ్వుతూ చెప్పింది. ఈ చిత్రం గురించి తనతో చెప్పేందుకు ధనుష్, సౌందర్య తన ఇంటికి వచ్చారని, అయితే, వారు చెప్పినట్టుగా తమిళ్ డైలాగ్స్ తక్కువగా ఏమీ లేవని, వాళ్లిద్దరూ మంచి వాళ్లని నమ్మాను కానీ, చెడ్డ వాళ్లని నిరూపించారంటూ కాజోల్ సరదాగా నవ్వుతూ చెప్పింది.

‘వీఐపీ2’ ఒప్పుకోకముందు, తాను చాలా భయపడేదాన్నని, ఎందుకంటే, వేరే భాషలో మాట్లాడటం, నటించడం కష్టమనే అభిప్రాయం తనకు ఉండేదని చెప్పింది. ఆ భయాన్ని పోగొట్టిన ధనుష్, సౌందర్య, నిర్మాత థన్ కు తన ధన్యవాదాలని పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రతిరోజూ పూర్తయిన తర్వాత తన గదికి వెళ్లి సహాయ దర్శకుడితో కలిసి డైలాగ్స్ ను గుర్తు చేసుకునేదాన్నని, మళ్లీ పాఠశాలలో చేరినట్టు అనిపించేదని గుర్తుచేసుకుంది. కాగా, ఈ చిత్రంలో ధనుష్ సరసన అమలాపాల్ నటిస్తుండగా, నెగటివ్ ఛాయలున్న కీలక పాత్రను కాజోల్ పోషిస్తోంది. ‘వీఐపీ 2’కు కథ, డైలాగ్స్ ధనుష్ అందించగా, సౌందర్య దర్శకత్వం వహించారు. ‘వీఐపీ2’ ఆడియో, ట్రైలర్ ను నిన్న సాయంత్రం ముంబయిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాజోల్, చిత్ర యూనిట్ హాజరయ్యారు. 

More Telugu News