: సుప్రీం ఆదేశాలను లెక్క‌చేయ‌ని పంజాబ్ అసెంబ్లీ.. హైవేల పక్కన రెస్టారెంట్లలో మద్యం సరఫరాకు అనుమతి!

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌లో భాగంగా గ‌తేడాది డిసెంబ‌ర్‌లో హైవేల‌కు 500 మీటర్ల దూరంలో మ‌ద్యం అందుబాటులో ఉండ‌కూడదని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను పంజాబ్ అసెంబ్లీ బేఖాతరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ చట్టానికి చేసిన సవరణను అసెంబ్లీ ఈ రోజు ఆమోదించింది. దీంతో పంజాబ్‌లో హైవేల పక్కన 500 మీటర్ల దూరంలో వుండే రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులు కస్టమర్లకు మద్యాన్ని సరఫరా చేయచ్చు. అయితే, హైవేల పక్కన మద్యం అమ్మే దుకాణాలకు మాత్రం అనుమతి లేదు.

సుప్రీం కోర్టు ఆదేశం వ‌ల్ల‌ రాష్ట్ర ప‌ర్యాట‌క రంగం దెబ్బ‌తిని, నిరుద్యోగం పెరిగిపోతోందని, అందుకే ఈ చట్ట సవరణ చేయాల్సి వచ్చిందని పంజాబ్ ఆరోగ్య శాఖా మంత్రి బ్రహ్మ మొహీంద్ర వివరణ ఇచ్చారు. కాగా, రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి చ‌క్రాల కుర్చీకే ప‌రిమిత‌మైన హ‌ర్మాన్ సింగ్ సాంధూ అనే వ్యక్తి పిటిష‌న్ మేర‌కు సుప్రీంకోర్టు ఈ ఆదేశాల‌ను జారీచేసిన విష‌యం విదిత‌మే.

More Telugu News