: వీరిలో డి-విటమిన్ ఎక్కువగా లోపిస్తోందట!

డి-విటమిన్ లోపించిన వారిలో తరచుగా ఒళ్లు విరుచుకోవడం, బాడీ పెయిన్స్, నిస్సత్తువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్ తీసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. అయితే, ఎండ బారిన పడకుండా, హాయిగా నీడపట్టున ఉంటున్నామనో, ఏసీలో కూర్చుని ఎంచక్కా పనిచేసుకుంటున్నామనో సంతోషించే వారు లేకపోలేదు. ముఖ్యంగా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసు గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిష్ట్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కు డి-విటమిన్ లోపించే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఈ విషయాన్ని కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ అల్ బెర్టా పరిశోధకులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పరిశోధకుడు డాక్టర్ సెబాస్టియన్ స్ట్రౌబ్ మాట్లాడుతూ, ఒకరి శరీరంలో విటమిన్-డి లెవెల్స్ కి వారు పని చేసే వృత్తి, పనివేళలకు సంబంధముందని అన్నారు. విటమిన్-డి లోపం కారణంగా మెటాబాలిక్, సైకియాట్రిక్, కార్డియోవాస్క్యులర్ డిజార్డర్స్, కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడతామని చెప్పారు. విటమిన్-డి లోపిస్తున్న వారిలో ఎక్కువగా షిఫ్ట్ వర్కర్స్ లో (80 శాతం ), ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు ( 77 శాతం ), హెల్త్ కేర్ విద్యార్థులు (72 శాతం ) ఉన్నట్టు తెలిపారు. హెల్త్ కేర్ వర్కర్స్ లో స్టూడెంట్స్, మెడికల్ విభాగాల్లో పని చేసే వారిలో విటమిన్-డి లోపించిందని అన్నారు. మెడికల్ రెసిడెంట్స్ లో 65 శాతం, ప్రాక్టీస్ లో ఉన్న వైద్యులలో 46 శాతం, నర్సులలో 43 శాతం, ‘హెల్త్ కేర్’కు సంబంధించిన ఇతర ప్రొఫెషనల్స్ లో 43 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తెలిపారు.

More Telugu News