: ఒంట్లో నలతగా ఉందని ఓ మంత్రి.. డాక్టర్ చేయద్దన్నారని మరో మంత్రి 'యోగా'కు దూరం!

ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగాసనాలు వేశారు. అయితే, యోగా దినోత్సవంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గౌరీశంకర్ బిసేన్, విద్యా శాఖ మంత్రి విజయ్ షా మాత్రం యోగాసనాలు వేయలేదు. ఆసనాలు వేయలేకపోవడానికి కారణం తనకు ఒంట్లో నలతగా ఉందని గౌరీశంకర్, ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని విజయ్ షా చెప్పడం గమనార్హం.

మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో మంత్రి గౌరీశంకర్ బిసేన్ సహా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభమైన కొంచెం సేపటికే, ఆయన కింద కూర్చోలేక పోయారు. అక్కడి నుంచి లేచి వెళ్లి సోఫాలో కూర్చున్న ఆయన నిద్రలోకి జారుకున్నారు. ఇదిలా ఉండగా, ఖంద్వా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల విద్యాశాఖ మంత్రి విజయ్ షా కూడా ఆసనాలు వేయలేదు. తన ఫోన్ ను చూసుకుంటూ కూర్చున్నారు.

 ఆసనాలు వేయకపోవడంపై ఆయన్ని మీడియా ప్రశ్నించగా...ఇటీవలే ఆసుపత్రి నుంచి తాను డిశ్చార్జి అయ్యానని, యోగాసనాలు వేయవద్దని డాక్టర్ తనకు సూచించారని, అందుకే, తాను యోగా చేయలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాన్ని వీక్షించేందుకే తాను ఫోన్ పట్టుకున్నాను తప్పా, వేరే విషయాల కోసం కాదని విజయ్ షా సమాధానమిచ్చారు.

More Telugu News