: నాకు ప్రాంతాలతో పని లేదు.. బ్రాహ్మణులకు సేవ చేయడమే లక్ష్యం!: వేమూరి ఆనంద్ సూర్య

తనకు ప్రాంతీయభేదాలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నియమించిన బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ పదవిని చేపట్టేందుకు అమరావతి చేరుకున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మణ సంఘం చైర్మన్ గా బ్రాహ్మణులకు చేసిన పనుల గురించి చెప్పుకోవడం అంటే ముఖ్యమంత్రికి భజన చేయడం కాదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత బ్రాహ్మణుల సంక్షేమానికి అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, అలాంటి వ్యక్తిని ఐవైఆర్ విమర్శించడం హాస్యాస్పదమని ఆయన చెప్పారు.

 అయితే ఐవైఆర్ గురించి తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని ఆయన చెప్పారు. తాను తెలంగాణకు చెందినవాడినని పలువురు ఆరోపించడంపై ఆయన మాట్లాడుతూ, పదవి దక్కితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతారని ఆయన అన్నారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని, బ్రాహ్మణులకు సేవలందించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. కాగా, ఏపీలో అసలు బ్రాహ్మణులే లేరా? తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఏపీ బ్రాహ్మణ సంఘం ఛైర్మన్ గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. 

More Telugu News