: ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు రాష్ట్రపతి కాన్వాయ్ నే ఆపిన ట్రాఫిక్ ఎస్ఐ!

రాష్ట్రపతి కాన్వాయ్ నే ఆపి, అంబులెన్స్ ను పంపించిన ఓ ట్రాఫిక్ ఎస్ఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బెంగళూరులో పర్యటించిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ట్రినిటీ సర్కిల్ మీదుగా రాష్ట్రపతి కాన్వాయ్ రాజ్ భవన్ కు వెళ్తున్న సమయంలో, ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఉండటాన్ని ట్రాఫిక్ ఎస్ఐ ఎంఎల్ నిజలింగప్ప గుర్తించారు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఈ అంబులెన్స్ వెళ్లాల్సి ఉంది. వెంటనే, స్పందించిన నిజలింగప్ప .. రాష్ట్రపతి కాన్వాయ్ ని ఆపి, ఆ అంబులెన్స్ వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశారు. ఈ విషయాన్ని బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ అభయ్ గోయల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. నిజలింగప్పకు రివార్డును కూడా అందజేసినట్టు తెలిపారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారడంతో, నిజలింగప్పపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News