: రామ్‌నాథ్ కోవింద్.. సివిల్స్‌లో పాస్.. ఎలక్షన్స్ లో ఫెయిల్!

రామ్‌నాథ్ కోవింద్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా రాష్ట్రపతి రేసులోకి వచ్చిన ఆయన గురించి ఒకటే చర్చ జరుగుతోంది. కారణం నిన్నటి వరకు ఆయన ఎవరో ఎవరికీ పెద్దగా తెలియనే తెలియదు. జనతా పార్టీ హయాంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసిన ఆయన 16 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత 1991లో కమలం పార్టీలో చేరారు. రెండేళ్ల క్రితం బీహార్ రాజ్‌భవన్‌కు చేరుకున్న కోవింద్ ప్రయాణం ఇప్పుడు రాష్ట్రపతి భవన్ వైపు సాగుతోంది. 1994, 2006లో కోవింద్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1977-78లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పర్సనల్ అసిస్టెంట్‌గానూ పనిచేశారు.

కాగా, 1975లో సివిల్స్ ఎగ్జామ్స్‌లో పాసైన కోవింద్‌ అనుబంధ సర్వీసులకు ఎంపిక కావడంతో చేరేందుకు ఇష్టపడలేదు. బీజేపీలో ఆయన చేరిన వెంటనే ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని ఘటంపూర్ నుంచి పార్టీ బరిలోకి దించింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2007లో మళ్లీ ఉత్తరప్రదేశ్‌లోని బోగ్నిపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగినా అప్పుడూ పరాజయం పాలయ్యారు. అయితే ఆయనలోని అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యం పార్టీని కట్టిపడేసింది. రెండేళ్ల క్రితం పార్టీ అధిష్ఠానం ఆయనను బీహార్ గవర్నర్‌గా పంపింది. ఇప్పుడు మళ్లీ అదే అధిష్ఠానం ఆయనను రాష్ట్రపతి భవన్‌కు పంపేందుకు పావులు కదుపుతోంది.

More Telugu News