: పెళ్లి చూపుల ఫోటోలకు వెళుతూ మృత్యుఒడికి ఒరాకిల్ టెక్కీ!

మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చేసింది. ఇక పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆ యువకుడు ఆలోచిస్తే, విధి మరొకటి లిఖించింది. బెంగళూరులో ఒరాకిల్ సంస్థలో పని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి (31), పెళ్లి చూపుల నిమిత్తం పంపాల్సిన ఫోటోలు తీయించుకునేందుకు వెళుతూ, ఘోర ప్రమాదంలో నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కర్నూలులో నివసిస్తున్న తన అక్క, బావ దగ్గరకు జగన్ వచ్చాడు. ఫోటోలు దిగేందుకు బావ లక్ష్మన్నతో కలసి బైకుపై వెళుతుండగా, పాత ఆర్టీఓ ఆఫీసు వద్ద వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. తలకు బలమైన గాయం తగలడంతో జగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసు అధికారులు, ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News