: పాక్ తో నెలకొన్న అన్ని సమస్యలకూ పరిష్కారం ఇదొక్కటే: రాందేవ్ బాబా

ప్రస్తుతం పాకిస్థాన్ అధీనంలో ఉన్న ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని యోగా గురువు రాందేవ్ బాబా డిమాండ్ చేశారు. పాక్ తో నెలకొన్న అన్ని సమస్యలకూ ఇదొక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. చంపారన్‌ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మోతిహారీలో నిర్వహించిన మూడు రోజుల యోగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలన్నిటినీ భారత సైన్యం ధ్వంసం చేయాలని సలహా ఇచ్చారు.

ఇండియాలో రక్తపాతం సృష్టించిన దావూద్ ఇబ్రహీంతో పాటు, సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులను ఇండియాకు పంపుతున్న అజర్ మసూద్, హఫీజ్ సయీద్ తదితరులను ప్రాణాలతోనైనా లేదా మృతదేహాలుగానైనా భారత్ కు అప్పగించాలని రాందేవ్ డిమాండ్ చేశారు. యోగాను రాజకీయ ఎజెండాగా చూడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన, బీహార్ లో మద్యపానాన్ని నిషేధించిన సీఎం నితీశ్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

More Telugu News