: రాందేవ్ బాబా తో పోటీ పడి యోగాసనాలు వేసిన యోగి ఆదిత్యనాథ్!

ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో, అందుకు సన్నాహకంగా జరిగిన ఓ కార్యక్రమంలో యోగా గురు బాబా రాందేవ్ తో పోటీ పడి మరీ యోగాసనాలు వేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వీరిద్దరితో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాం నాయక్ సైతం చేరిపోయి, తనకూ యోగా తెలుసునని చూపారు. ఈ ఉదయం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా యోగా సన్నాహకాల్లో పాల్గొన్నారు.

కాగా, 21న లక్నోలో భారీ ఈవెంట్ జరగనుండగా, 50 వేల మందితో కలసి ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్ లు యోగాసనాలు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రాహుల్ భట్నాగర్ అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కార్యకర్తలను, సీనియర్ సిటిజన్ లను యోగా డేలో భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. ఇటీవలి తన 'మన్ కీ బాత్'లో మూడు తరాల ప్రతినిధులు కలసి మూడవ యోగా ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News