: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఇండియన్ ఆర్మీ.. త్వరలో యుద్ధ రంగంలోకి మహిళలు!

భారత ఆర్మీ చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో కదన రంగంలో మహిళలు కాలుపెట్టనున్నారు. ఫలితంగా ఇన్నాళ్లూ ఈ రంగంలో  ఉన్న కట్టుబాట్లు తెగిపోనున్నాయి. మహిళలను యుద్ధ రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. త్వరలోనే మిలటరీ పోలీస్‌లోకి మహిళలను తీసుకుంటామని పేర్కొన్నారు.

మహిళలను జవాన్లుగా చూడాలనుకుంటున్నానని, త్వరలోనే దీనిని సాకారం చేయబోతున్నట్టు రావత్ వెల్లడించారు. మహిళలను తొలుత మిలటరీ పోలీసు జవాన్లుగా తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆర్మీలోని మెడికల్, లీగల్, ఎడ్యుకేషనల్, సిగ్నల్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో మహిళలను నియమిస్తున్నా యుద్ధ రంగంలోకి మాత్రం వారిని ఇంకా అనుమతించడం లేదు. ప్రభుత్వ అనుమతి అనంతరం మహిళా జవాన్లను నియమించనున్నట్టు ఆర్మీ చీఫ్ తెలిపారు. కాగా, గతేడాది భారత వాయుసేనలోకి మహిళలు ప్రవేశించి చరిత్ర సృష్టించారు. ముగ్గురు మహిళలు అవని చతుర్వేది, భావన కాంత్, మోహన సింగ్‌లు ఫైటర్ పైలట్లుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన విషయం విదితమే.

More Telugu News