: లై డిటెక్టర్ పరీక్షకు ఒప్పుకోను గాక ఒప్పుకోను.. సీబీఐతో మాజీ ఎంపీ షాబుద్దీన్

జర్నలిస్టు రాజ్‌డియో రంజన్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్ లై డిటెక్టర్ పరీక్షలకు అంగీకరించడం లేదు. హత్యకేసుతో ఆయనకు సంబంధముందని భావిస్తున్న సీబీఐ అతడు కొన్ని విషయాలను దాస్తుండడంతోపాటు అబద్ధాలు చెబుతున్నట్టు గుర్తించింది. దీంతో అతడికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే అందుకు ఆయన సహకరించడం లేదని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్ టెస్ట్) పరీక్షకు వెళ్లే ముందు నిందితుడి అంగీకారం తీసుకోవడం తప్పనిసరి కావడంతో దీనిని తనకు అనుకూలంగా మార్చుకున్న షాబుద్దీన్ అందుకు అంగీకరించడం లేదు. మరోవైపు 8 రోజులుగా తమ కస్టడీలో ఉన్న షాబుద్దీన్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది. సోమవారంతో అతడి కస్టడీ ముగియనుంది.

హిందీ దినపత్రిక సివాన్ బ్యూరో చీఫ్‌గా ఉన్న రాజ్‌డియో రంజన్ గతేడాది మేలో కాల్చివేతకు గురయ్యారు. ఆయన హత్య వెనక షాబుద్దీన్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పలు ఇతర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్ అప్పటి నుంచి జైలులో ఉంటున్నారు. ఆ తర్వాత ఆయనను తీహార్ జైలుకు మార్చారు.

More Telugu News