: సంచలనం కలిగించిన ఈ ఫోటోలోని 11 మంది ఉగ్రవాదుల్లో మిగిలింది ఒక్కడే!

జమ్మూకశ్మీర్ లో రక్తపాతం సృష్టించడమే లక్ష్యంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ పెంచి పోషించిన 11 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్లో ఇక మిగిలింది ఒక్కరు మాత్రమే. కాశ్మీర్ లోయలో ఈ 11 మంది తీయించుకున్న ఓ సెల్ఫీ చిత్రం రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించగా, ఆపై ఒక్కొక్కరూ అంతమవుతూ వచ్చారు. ఈ చిత్రంలోని వారిలో ఒక్క సద్దాం పద్దార్ (నంబర్ 9) మినహా మిగతా వారిలో 9 మంది భద్రతా దళాల చేతుల్లో హతం కాగా, తారీక్ పండిట్ మాత్రం పోలీసులకు లొంగిపోయాడు.

ఈ చిత్రంలోని బుర్హాన్ వనీ, అదీల్ ఖాండ్, నాజర్ పండిట్, అఫాక్ భట్, సబ్జార్ భట్, అనీస్, ఇష్ఫాక్ దార్, వాసీమ్ మల్లా, వసీమ్ షాలను వివిధ ప్రాంతాల్లో జరిపిన ఎన్ కౌంటర్లలో సైన్యం మట్టుబెడుతూ వచ్చింది. వీరందరి తలలపై లక్షల రూపాయల బహుమానాలు ఉన్నాయి. జూలై 2015లో తొలిసారిగా ఈ ఫోటో ఫేస్ బుక్ లో అప్ లోడ్ కాగా, అందరి చేతుల్లో ఏకే తుపాకులు ఉండటం పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక టీములోని సద్దాం పద్దార్ మాత్రమే బతికుండటంతో, ఇటీవల హతుడైన సబ్జార్  భట్ స్థానంలో అతనికి బాధ్యతలు అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ గ్రూప్ లో అత్యంత కీలకమైన బుర్హాన్ వనీని గత సంవత్సరం జూలైలో భద్రతాదళాలు హతమార్చగా, అప్పటి నుంచి కాశ్మీర్ లోయ ఆందోళనలతో అట్టుడుకుతున్న సంగతి విదితమే.

More Telugu News