: నటుడు కళాభవన్ మణి మృతి కేసు సీబీఐకి బదిలీ

ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసు సీబీఐకి బదిలీ అయింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కేరళ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. నెల రోజుల్లోగా కేసు విచారణను ప్రారంభించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. గతేడాది మార్చి 6న కళాభవన్ మణి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృత దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ అవశేషాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది.

అంతేకాదు, ఆయన మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో, మణి స్నేహితులకు నార్కో అనాలిసిస్ పరీక్షలు కూడా చేశారు. అయినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ కళాభవన్ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. అంతేకాదు హైకోర్టును కూడా ఆశ్రయించాడు. దీంతో, సీబీఐ విచారణ జరిపించాలంటూ కేరళ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

More Telugu News