: బాలీవుడ్ నటి కాజోల్ పై వేటు వేయనున్న ప్రసారభారతి?

ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ను ప్రసారభారతి బోర్డు నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ప్రసారభారతి పార్ట్ టైమ్ మెంబర్ గా కాజోల్ ను నియమించారు. అయితే, గత నాలుగు సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. వాస్తవానికి వరుసగా మూడు సమావేశాలకు ఛైర్మన్ అనుమతి లేకుండా డుమ్మా కొడితే... వారి మెంబర్ షిప్ ను కేన్సిల్ చేస్తారు.

ఈ నేపథ్యంలో, చివరి మీటింగ్ లో కాజోల్ గైర్హాజరీ గురించి బోర్డు సభ్యులు చర్చించారు. ఆమెపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. అయితే కాజోల్ అధికార ప్రతినిధి జైవీర్ మాట్లాడుతూ, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, కొన్ని వృత్తిపరమైన సమస్యల కారణంగానే ఆమె చివరి నాలుగు సమావేశాలకు హాజరుకాలేదని తెలిపాడు. ఏదేమైనప్పటికీ ఛైర్మన్ అనుమతి కూడా తీసుకోకపోవడంతో కాజోల్ పై వేటు వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ సమావేశాలకు హాజరయ్యే సభ్యులకు విమాన ఖర్చులు, హోటల్, రవాణా ఛార్జీలతో పాటు ప్రత్యేక అలవెన్సులు చెల్లిస్తారు. 

More Telugu News