: మరికొన్ని గంటల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వరుడి దుర్మరణం.. విషాదంలో ఇరు కుటుంబాలు

పెళ్లికి కొన్ని గంటల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు మరణించిన ఘటన సూర్యాపేట జిల్లాలోని మోతె సమీపంలో చోటుచేసుకుంది. వరుడి మృతి వార్త తెలిసి పెళ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరుడు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని వధువు ఇంటికి డీసీఎంలో బయలుదేరారు. మార్గమధ్యంలో మోతె గ్రామం వద్ద ఓ పెట్రోలు బంకు సమీపంలో డీసీఎంను ఆపగా, వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది.

ప్రమాదంలో పెళ్లికొడుకు వెంకటశేషసాయి (21), దామోదర్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని కోదాడ ఆస్పత్రికి తరలించారు. నేటి (బుధవారం) రాత్రి పెళ్లి జరగనుండడంతో మంగళవారం అర్ధరాత్రి దాటాక పెళ్లి బృందం డీసీఎంలో ఖమ్మం బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.


More Telugu News