: సబ్ జైల్లో ఉన్న 'పొలిటికల్ పంచ్' రవికిరణ్ ను కలిసిన విజయసాయి రెడ్డి

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగులు పెట్టిన 'పొలిటికల్ పంచ్' అడ్మిన్ రవికిరణ్ గుంటూరు సబ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయనను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రవికిరణ్ ను చంద్రబాబు సర్కార్ జైల్లో పెట్టించిందని ఆరోపించారు. రవికిరణ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోందని... అందుకే సోషల్ మీడియాలో వారు స్పందిస్తున్నారని తెలిపారు. తమపై కూడా టీడీపీ వాళ్లు చాలా కార్టూన్లు వేశారని... మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసు అధికారులు అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని... అక్రమ కేసులు బనాయించిన వారిని వదిపెట్టబోమని హెచ్చరించారు.

More Telugu News