: విస్తుపోయే నిజం... తెలంగాణను వీడి ఏపీ స్థానికతను కోరింది 850 మంది మాత్రమే!

ఏపీ విభజనకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఉండి, ఆపై ఏపీకి వెళ్లి అక్కడి స్థానికతను కోరిన వారు ఎంతమందో తెలుసా? కేవలం 850 మంది మాత్రమే. స్థానికత కోరేందుకు గడువు మరో 15 రోజులు మాత్రమే మిగిలివుండటంతో, చాలా తక్కువ మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం అధికార వర్గాలకు విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి విభజన తరువాత మూడేళ్లలోపు ఏపీకి వెళ్లిన ప్రతి ఒక్కరికీ స్థానికత కల్పించేలా ప్రభుత్వం అంగీకరించింది. ఆపై జూన్ 2, 2017లోపు ఏపీలోని 13 జిల్లాల్లో ఎక్కడైనా నివాసం ఏర్పరచుకుని, మీ సేవలో దరఖాస్తు చేస్తే స్థానికత లభిస్తుంది.

ఈ అధికారం ఆ ప్రాంత ఎమ్మార్వోలకే ఇచ్చారు. అయితే అత్యధిక మండలాల్లో కనీసం ఒక్కరు కూడా స్థానికతను కోరలేదు. ఇక పలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు ఇప్పుడిప్పుడే నవ్యాంధ్రకు వస్తుండటం, 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ ను వీడకపోవడం, కొత్త పరిశ్రమలు వస్తే, మరింత మందికి ఉపాధి లభించి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుందన్న అంచనాలతో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగించాలని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక సామాన్యులకు స్థానికత మార్పుపై అవగాహనా లేమి కూడా దరఖాస్తులు నామమాత్రంగా ఉండటానికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

More Telugu News