: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు భేష్.. కొనియాడిన ఉత్తరప్రదేశ్ ఆరోగ్యశాఖామంత్రి

ఏపీలో ఆరోగ్య సేవలు చక్కగా ఉన్నాయని, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు అద్భుతంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ కొనియాడారు. ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో వాటి అమలుతీరును పరిశీలించేందుకు అధికారులతో కలిసి గురువారం ఆయన రాష్ట్రంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఆయన సమావేశమయ్యారు. ఒకేసారి 30 పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తుండడంపై ఉత్తరప్రదేశ్ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. యూపీలో ఆరోగ్యశాఖ ప్రస్తుతం ఐసీయూలో ఉందని మంత్రి సిద్ధార్థనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏయే రాష్ట్రాల్లో ఆరోగ్య  పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని కేంద్ర మంత్రి నడ్డా, ముఖ్యకార్యదర్శి మిశ్రా, నీతి ఆయోగ్‌ను అడగ్గా వారు ఏపీనే చూపించారని, అందుకే పర్యటన కోసం ఇక్కడికి వచ్చినట్టు మంత్రి వివరించారు.

More Telugu News