: నిన్న ప్రియురాలిని చంపేశాడు...నేడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు

నిన్న చెన్నైలో కలకలం రేపిన అన్నానగర్‌ టీచర్‌ హత్యకేసులో ముద్దాయి అగ్నిమాపకదళ డ్రైవర్‌ ఇళయరాజా నేడు జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోయంబత్తూరు అన్నామలైనగర్‌ కు చెందిన టీచర్‌ నివేద (47) భర్తతో విడిపడి సుదీర్ఘ కాలంగా ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె తన  ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఇళయరాజాతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఫేస్ బుక్ లో గణపతి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చాడు. అయితే గణపతి తన అడ్రెస్ ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడడం, ఆమె నుంచి పదేపదే డబ్బులు తీసుకుంటుండడంతో ఇళయరాజా ఆమెను హెచ్చరించాడు.

ఆ తరువాత వివాహ విషయం తెలియడంతో వారిద్దరినీ నిలదీసిన ఇళయరాజా...వారి బంధాన్ని భరించలేకపోయాడు. ఈ క్రమంలో తనను వదిలి, అతని బైక్ పై వెళ్లడాన్ని జీర్ణించుకోలేక..తన కారుతో దూసుకెళ్లి వారిని అన్నానగర్‌ ప్రాంతంలో ఢీ కొట్టాడు. కిందపడ్డ నివేద అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గణపతి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం వివరాలు సేకరించడంతో నేరం అంగీకరించిన ఇళయరాజాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పుళల్‌ జైలుకి తరలించారు.

అనంతరం మనస్తాపానికి గురైన ఇళయరాజా తనకు కేటాయించిన సెల్‌ లోని కిటికీ చువ్వకు లుంగీ కట్టి ఉరి వేసుకున్నాడు. ఈ ఉదయమే విధులకు హాజరైన వార్డర్లకు అతను వేలాడుతూ కనిపించడంతో... అతనిని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.  

More Telugu News