: మారిన టోకు ధరల సూచీ లెక్కలు... చాక్లెట్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకూ చేరిక

ద్రవ్యోల్బణం సాగుతున్న వైనాన్ని తెలియజేసే టోకు ధరల సూచీని మరింత పారదర్శకం చేయడమే లక్ష్యంగా పలు కొత్త ఉత్పత్తులను ఐఐపీ (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్)లో చేరుస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్తగా చేరే ఉత్పత్తులు శుక్రవారం నుంచి టోకు ధరల సూచికను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. వీటిల్లో ఇండియాలో విరివిగా అమ్ముడవుతూ, ఇప్పటివరకూ ధరల పెరుగుదల గణాంకాల లెక్కలోకి రాని పలు ప్రొడక్టులు ఉన్నాయి.

 చాక్లెట్లు, నూడుల్స్, స్మార్ట్ ఫోన్లు, క్రికెట్ బ్యాట్లు, ల్యాప్ టాప్ లు, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు, హార్మోనియం, గిటార్ తదితరాలను చేర్చారు. ఇక ప్రత్యేక విభాగంగా, బొమ్మలు, సైకిళ్లు, క్యారమ్ బోర్డులు, పేకలు తదితరాలను చేర్చినట్టు గణాంకాల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత సిరీస్ లో క్రీడలకు సంబంధించిన ఫుట్ బాల్, క్రికెట్ ఉత్పత్తులు మాత్రమే ఉండగా, టెన్నిస్, బ్యాడ్మింటన్ రాకెట్లు వంటి వాటిని కూడా జత చేసినట్టు తెలిపారు. ఇదే సమయంలో 1993-94 సిరీస్ లో జతచేసిన పాత ఫోన్ మోడళ్లను తొలగించామని పేర్కొన్నారు. జీడీపీ గణాంకాలను మరింత కచ్చితంగా చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

More Telugu News