: మూడో కంటికి తెలియకుండా మందుకొడుతున్న ఎలుకలు!

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ అధికారం చేపట్టగానే ఆ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీహార్ రాజధాని పాట్నాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఆ సరుకును  పోలీస్ స్టోర్ రూమ్స్ లో పెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఎందుకంటే.. స్టోర్ లో ఉంచిన మద్యం సీసాలు ఒకటెనుక మరోటి ఖాళీ అయిపోతున్నాయి.

తమ సిబ్బంది ఏమైనా ఈ సీసాలను ఖాళీ చేస్తున్నారేమోననే అనుమానం పాట్నా ఏఎస్పీ మను మహరాజ్ కు తలెత్తింది. వెంటనే, ఆ గదులకు కాపలా కాస్తున్న సిబ్బందికి బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేయించాడు. ఏ ఒక్కరూ పట్టుబడలేదు. అయితే, ఈ టెస్టుకు ఓ కానిస్టేబుల్ అంగీకరించకపోవడంతో ఆయన్ని పదవి నుంచి తొలగించారు. కానీ, మద్యం సీసాలను ఎవరు ఖాళీ చేస్తున్నారనే విషయం మాత్రం తేలలేదు.

దీంతో, తీవ్రంగా దర్యాప్తు చేస్తే.. చివరకు ఎలుకలు దోషులుగా తేలాయి. పోలీస్ స్టోర్ రూమ్స్ నిండా విపరీతమైన ఎలుకలు ఉండటంతో.. మద్యం సీసాల మూతలను కొంచెం కొంచెంగా కొరికేసి...మందు కొట్టేస్తున్నాయని తేలింది. ఒకటో రెండో మద్యం బాటిల్స్ కాదు..ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎంచక్కా ఎలుకలు తాగేశాయిని తేలింది. దీంతో, పోలీసు సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అన్ని పోలీస్ స్టోర్ రూమ్స్ లో ఎలుకలు లేకుండా చేయాలని మహరాజ్ ఆదేశించారు.

More Telugu News