: మోదీ షూని విప్ప‌బోయిన సహాయకుడు... వ‌ద్ద‌ని చెప్పిన ప్రధాని

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆల‌యంలో రుద్రాభిషేకం చేయించ‌డానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, మోదీ మందిరంలోకి వెళ్ల‌డానికి బూట్లు విప్పుతుండ‌గా ఓ వ్య‌క్తి ఆయ‌న‌కు సాయం చేయ‌డానికి వ‌చ్చి, బూట్లు విప్ప‌డానికి య‌త్నించాడు. మోదీ మాత్రం ఆ వ్య‌క్తితో అలా చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఎంతో మంది మంత్రులు, ప్ర‌భుత్వాధికారులు త‌మ బూట్ల‌ను స‌హాయ‌కుల‌తో విప్పించుకుని గ‌తంలో విమ‌ర్శ‌లు ఎదుర్కున్న విష‌యం తెలిసిందే. త‌మ చెప్పుల‌ను సహాయ‌కుల‌తో మోయించుకొని కూడా ప‌లువురు క‌లెక్ట‌ర్లు మీడియాకు చిక్కి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. మోదీ మాత్రం త‌న బూట్లు విప్ప‌డానికి సాయప‌డ‌తాన‌న్న వ్య‌క్తిని వ‌ద్ద‌ని చెప్పి ఆద‌ర్శంగా నిలిచారు.

వీఐపీ సంస్కృతికి ముగింపు ప‌ల‌కాలని మోదీ పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ విధంగా ఆచ‌ర‌ణ‌లోనూ నిబద్ధ‌త క‌న‌బ‌రుస్తూ ఆయ‌న స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆయ‌న‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 28 ఏళ్ల‌లో కేదార్‌నాథ్‌లో రుద్రాభిషేకం జ‌రిపించిన తొలి ప్ర‌ధానిగా కూడా మోదీ నిలిచారు. 28 ఏళ్ల క్రితం వీపీ సింగ్ రుద్రాభిషేకం చేశారు.

More Telugu News