: 'సింధు' బయోపిక్ ను నిర్మిస్తున్న సోనూ సూద్!

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జీవిత కథ సినిమాగా తెరకెక్కనుంది. ఒలింపిక్స్ లో రజతపతకం సాధించడంతో సింధు కీర్తి ప్రతిష్ఠలు దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. ఎవరికీ సాధ్యం కాని పతకాన్ని సాధించడంతో ఆగిపోకుండా...వరుస విజయాలతో పాటు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి, ఎంతో మంది యువతకు సింధు స్పూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో సింధు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ నిర్మించాలని తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో విలన్ గా రాణించిన సోనూ సూద్ భావిస్తున్నాడు.

ఈ మేరకు గత ఐదు నెలలుగా చర్చలు సాగుతున్నాయని సోనూ సూద్ వెల్లడించాడు. ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన సింధు జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందని సోనూ సూద్ వెల్లడించాడు. ఆమె జీవితం గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపాడు. త్వరలో నటీనటులు, ఇతర  వివరాలు వెల్లడిస్తానని సోనూ సూద్ తెలిపాడు. కాగా, సైనా నెహ్వాల్ బయోపిక్ ఆధారంగా ఒక సినిమా రూపొందనుండగా, అందులో శ్రద్దాదాస్..సైనా పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

More Telugu News