: యడ్యూరప్పకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా

కర్ణాటక బీజేపీలో రెండు వర్గాలుగా చీలి నిత్యమూ విమర్శలు, ప్రతి విమర్శలతో గొడవలు పడుతున్న మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప, కేఎస్ ఈశ్వరప్ప వర్గాల్లో ఇద్దరేసి నేతలపై బహిష్కరణ వేటు పడింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత ఈ రెండు వర్గాలూ ఒకరిపై ఒకరు బురద జల్లుకున్న సంగతి తెలిసిందే. తప్పు మాది కాదంటే, మాది కాదని, అవతలి వర్గంపై చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో సీరియస్ అయిన అమిత్ షా, బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌ చార్జి మురళీధర్ రావుతో చర్చించి రెండు వర్గాల్లోని ఇద్దరు నేతలను తొలగించారు.

పార్టీ ఉపాధ్యక్షులు భానుప్రకాష్, నిర్మల్ కుమార్ సురానా, రైతు మోర్చా ఉపాధ్యక్షుడు రేణుకాచార్య, అధికార ప్రతినిధి జి.మధుసూదన్‌ లను తక్షణమే అన్ని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా యడ్యూరప్పకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చూసుకోవాలని ఆయన హితవు పలికినట్టు సమాచారం. 2018లో రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తుంటే, ఈ తరహా ఫిర్యాదులు, విభేదాల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, దీన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు.

More Telugu News