: మాంసం కోసం కక్కుర్తిపడ్డ వరుడి కుటుంబం... అదే ముహూర్తానికి 'అతిథి'ని వివాహం చేసుకున్న వధువు!

పెళ్లిళ్లలో చిన్నచిన్న విషయాలకు పెద్దపెద్ద గొడవలు జరుగుతుంటాయి. అవి జీవితాంతం ప్రభావం చూపుతుంటాయి. అలాగే మాంసాహారం లేదని గొడవపడ్డ వరుడ్ని కాదని, పెళ్లికి వచ్చిన ఓ అతిథిని వివాహమాడిన సినీ ఫక్కీ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌ లోని కుల్హేదీ గ్రామంలో వరుడు, వధువుకు వివాహం నిర్ణయించారు. వివాహ ముహూర్తం ప్రకారం బుధవారం వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుకకు వచ్చిన బంధువులకు భోజనం పెట్టారు. ఈ భోజనంలో మాంసాహారం పెట్టలేదని వరుడి కుటుంబం వధువు కుటుంబంతో ఘర్షణకు దిగింది. సీఎం ఆదిత్యనాథ్ కబేళాలు రద్దు చేయడంతో మాంసం దొరకడం లేదని, అందుకే మాంసం కొరత ఏర్పడి వండలేదని వరుడి కుటుంబానికి వధువు కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు.

అయినా వారు శాంతించకపోవడంతో తిక్కరేగిన వధువు... తిండి కోసం రభస చేసే అలాంటి కుటుంబంతో తనకు బంధం వద్దని తేల్చిచెప్పింది. ఈ తతంగం మొత్తాన్ని గమనించిన అతిథి... యువతి ధైర్యం తనకు నచ్చిందని, తాను ఆమెను వివాహం చేసుకుంటానని ముందుకు వచ్చాడు. దానికి వధువు అంగీకరించడంతో అదే ముహూర్తానికి ఆ అతిథితో వివాహ తంతు పూర్తి చేశారు. దీంతో వరుడి కుటుంబం షాక్ తింది. ఘోర అవమానంతో వెనుదిరిగింది.

More Telugu News