: ‘బాహుబలి’ని క్యాష్ చేసుకుంటున్న మల్టీప్లెక్స్‌లు.. ఇష్టం ఉన్నా లేకున్నా కూల్‌డ్రింక్స్, పాప్‌కార్న్ కొనాల్సిందే!

‘బాహుబలి–ది కన్‌క్లూజన్‌’పై ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు మల్టీప్లెక్స్‌లు తెరతీశాయి. ప్రేక్షకుల జేబులు గుల్ల చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంబో ఆఫర్లు, ఎంట్రీ పాస్‌ల పేరిట నయా దందాకు రంగం సిద్ధం చేశాయి. ఇష్టం ఉన్నా లేకున్నా కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినుబండారాలను అమ్ముకుని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి. దీనికి ప్రత్యేకంగా ‘కాంబో ఆఫర్’ అని పేర్లు తగిలించాయి. ఆఫర్ల పేరుతో టికెట్ ధరను ఏకంగా 75 శాతం పెంచే స్కెచ్ వేశాయి. దళారులు, మల్టీప్లెక్స్ నిర్వాహకులు కలిసి ఈ దందాకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

బాహుబలి సినిమాకు మొదటి మూడు రోజులపాటు కార్పొరేట్ షోల పేరుతో మల్టీప్లెక్స్‌లలో టికెట్లన్నీ బల్క్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఇందుకోసం మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి ఫుడ్ కూపన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే టికెట్ ధర రూ.150 అయితే కాంబో ఆఫర్ పేరుతో దానిని రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. తద్వారా ఒక్క షో ద్వారానే లక్షలాది రూపాయలు పిండుకుంటున్నారు. ఇక ఒక్కో టికెట్‌ను రూ.450 పెట్టి కొంటున్న దళారులు వాటిని ఎంట్రీ పాస్‌ల రూపంలో ప్రింట్ చేస్తున్నారు. వాటిపై వివిధ సంస్థల ప్రకటనలను ముద్రించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ పాస్‌లను రూ.1000 వరకు అమ్ముకుంటున్నట్టు చెబుతున్నారు. మల్టీప్లెక్స్‌ల దందాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

More Telugu News