: ఆ రోజు ‘పాకిస్థాన్ జిందాబాద్’, ‘గో ఇండియా-గో బ్యాక్’ అంటూ రెచ్చగొట్టినా నిగ్రహంతో ఉన్నా: కశ్మీర్ లో రాళ్లదాడికి గురైన జవాన్ విక్కీ విశ్వకర్మ

జమ్మూకాశ్మీర్ యువత తనపై దాడి చేస్తున్నా ఎంతో సహనం వహించిన భారత జవాన్ విక్కీ విశ్వకర్మను ఎవరూ మర్చిపోలేరు. జమ్మూకాశ్మీర్ లో తన విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఇటీవల ఈ సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ఓ ఇంటర్వ్యూలో విశ్వకర్మ మాట్లాడుతూ,‘‘ఆ సంఘటన జరిగిన రోజున అక్కడి యువత ‘పాకిస్థాన్ జిందాబాద్, గో ఇండియా- గో బ్యాక్’’ అని నినాదాలు చేస్తూ రెచ్చగొట్టినా.. నేను నిగ్రహం కోల్పోలేదు. రాళ్లు రువ్వే వారిని చూసి నేను భయపడను. ఈ ప్రాంతం చాలా సున్నితమైన ప్రాంతం. మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలను ఏ విధంగా కాపాడాలో మాకు శిక్షణలో భాగంగా నేర్పించారు.

అందుకే, ఆ సంఘటన చోటుచేసుకున్న సమయంలో నేను మౌనంగా ఉన్నాను. నా విధులను నేను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నాను. దేశ క్షేమం కోసం ఆ సమయంలో స్పందించలేదు. నా చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేస్తాను’ అని విశ్వకర్మ చెప్పారు. కాగా, ఆ ఘటనపై విశ్వకర్మ తల్లి మాట్లాడుతూ, సరిహద్దుల్లో విధులకు తన కొడుకును వేశారంటే మొదట్లో భయపడ్డానని, అయితే, ఆ సంఘటన జరిగిన రోజున.. తన కొడుకు ఎంతో సహనంతో ప్రవర్తించి గర్వపడేలా చేశాడని చెప్పారు.  

More Telugu News