: ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు బంద్: పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం

సెల‌వు తీసుకోకుండా ప‌నిచేస్తోన్న పెట్రోల్‌ బంకులు ఇక‌పై ఆదివారం మాత్రం హాలీ డే తీసుకోనున్నాయి. ముందుగా అనుకున్న మేర‌కే ఈ ఏడాది మే 14న నుంచి ఈ నిర్ణ‌యాన్ని అమలు చేస్తున్న‌ట్లు ఈ రోజు పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం తెలిపింది. ఇటీవ‌లే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.. పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ పిలుపు మేరకు తాము ప్ర‌తి ఆదివారం ఈ నిర్ణ‌యాన్ని అమలు చేయనున్నామని పెట్రోల్‌ బంకు యజమానుల సంఘం పేర్కొంది.

ఇండియన్‌ పెట్రోలియం డీలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు సురేష్‌ కుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ... కొన్నేళ్ల కిత్రం ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకుల‌కు సెల‌వు ఉండేద‌ని, అయితే, ఆయిల్‌ కంపెనీల కోరిక మేరకు తాము ఆదివారం కూడా వాటిని న‌డిపిస్తున్నామ‌ని తెలిపారు. ఇక‌పై మ‌ళ్లీ త‌మ నిర్ణ‌యాన్ని వెనక్కు‌తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. దీంతో మే 14వ తేదీ నుంచి ప్రతి ఆదివారం మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవు. వాటిల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.

త‌మ నిర్ణ‌యం వ‌ల్ల ఒక్క తమిళనాడులోనే దాదాపు రూ.150 కోట్ల నష్టం వస్తుందని సురేష్‌ కుమార్ చెప్పారు. అయితే, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఒకరు ఆ రోజు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, అత్యవసర పరిస్థితి ఏర్పడిన సమయంలో మాత్రమే వారు పెట్రోల్ విక్ర‌యిస్తార‌ని తెలిపారు.

More Telugu News