: 8 కాళ్లతో పుట్టిన శిశువుకి విజయవంతంగా ఆపరేషన్లు చేసిన ఢిల్లీ వైద్యులు

ఇరాక్‌లో ఎనిమిది కాళ్ల‌తో పుట్టిన శిశువుకి న్యూ ఢిల్లీ వైద్యులు అరుదైన ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించి, విజ‌యం సాధించారు. గతేడాది అక్టోబర్‌లో ఇరాక్‌లో సర్వాద్‌ అహ్మద్‌ నాదర్‌, గుఫ్రాన్‌ అలీ దంపతులకు ఎనిమిది కాళ్ల‌తో ఓ బాబు పుట్టాడు. ఆ చిన్నారికి కరమ్ అనే పేరు పెట్టారు. ఆ బిడ్డకు శ‌స్త్ర చికిత్స చేయాలని సూచించిన అక్కడి వైద్యుల సల‌హా మేర‌కు త‌మ కుమారుడిని ఢిల్లీలోని జేపీ ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని నెల‌లుగా న్యూ ఢిల్లీ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉన్న ఆ బాలుడికి మొత్తం మూడు సార్లు ఆపరేషన్లు నిర్వహించారు. ప్ర‌స్తుతం ఆ చిన్నారి పూర్తిగా కోలుకున్నాడ‌ని, దీంతో ఆ బాలుడిని డిశ్చార్జ్ చేస్తున్న‌ట్లు ఈ రోజు వైద్యులు తెలిపారు.

తల్లి గర్భంలో కవలలు రూపుదిద్దుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అందులో ఒక బిడ్డ ఎదుగుదల ఆగిపోవడం వల్ల ఇటువంటి శిశువులు జ‌న్మిస్తార‌ని వైద్యులు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో బిడ్డ పొట్టపై ఉన్న అవయవాలను తొలగించి, ఆ త‌రువాత కార్డియాక్‌ సమస్య ప‌రిష్కారానికి మ‌రో ఆప‌రేష‌న్, అనంత‌రం ఆ శిశువుపై మిగిలిన భాగాల్లో ఉన్న అవయవాలను తొలగించడానికి మరో ఆపరేషన్ చేసినట్లు చెప్పారు.


More Telugu News